Monday, December 22, 2008

సమాచారం అందడంలేదు!

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) పలు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మొత్తం చట్టం ఉద్దేశమే దెబ్బతింటోందని పేర్కొంది. గుజరాత్‌, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లలోని కొన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఆర్‌ఐఏ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం నిర్వహించింది. మొత్తం పది రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వే ఫలితాలను 'ఆర్‌టీఐ కింద సమాచారం పొందడం: ప్రజల అనుభవం' పేరుతో విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లో 90శాతం మంది, కేరళలో 84శాతం మంది ప్రజా సమాచార అధికారుల (పీఐఓ) నుంచి కోరిన సమాచారాన్ని పొందుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో 55శాతం, రాజస్థాన్‌లో 66శాతం, హర్యానాలో 68శాతం మందికి అది లభిస్తోందని పేర్కొంది. మొత్తంమీద సగటున 68.41శాతం మందికి మాత్రమే కోరిన సమాచారం లభ్యమవుతోంది. బీహార్‌, జార్ఖండ్‌లలో కేవలం 45శాతం మంది దరఖాస్తుదారులకు మాత్రమే కావాల్సిన సమాచారం లభిస్తోందని తెలిపింది. ప్రజలు కోరిన సమాచారం ఇచ్చే విషయంలో పీఐఓలు ఆలస్యంగా స్పందించడం వల్లే ఈ చట్టం ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదని సర్వే పేర్కొంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు చేసిన 150 రోజుల తర్వాతే అధికారులు ఆ సమాచారం అందిస్తున్నారని, పైగా అందుకోసం దరఖాస్తుదారుడు కనీసం ఐదుసార్లు వారిచుట్టూ తిరగాల్సి వస్తోందని వెల్లడించింది. దాదాపు 43శాతం మంది దరఖాస్తుదారులు రెండు నుంచి ఐదుసార్లు సంబంధిత విభాగాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. బీహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌లలో పరిస్థితి మరీ ఘోరంగాఉందని పేర్కొంది. 20శాతం మందికి పైగా దరఖాస్తుదారులు సంబంధిత అధికారుల వద్దకు పదిసార్ల కంటే ఎక్కువగానే వెళ్లాల్సి వస్తోందని తెలిపింది.

Labels:

0 Comments:

Post a Comment

<< Home