Thursday, December 27, 2007

పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు

రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 24 గంటలూ పని చేసేలా మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో కిరోసిన్ బంకులను కూడా నెలకొల్పుతున్నట్లు చెప్పారు. దీన్ని నివారించడం కోసమే ముందుగా పాత తాలూకా కేంద్రాల్లో మందుల షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళలో పౌరసరఫరాల సంస్థ విజయవంతంగా మందుల షాపులను నడుపుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఖరీప్‌లో రైతులకు వరి ధాన్యం మద్దతు ధరలు లభిస్తున్నాయన్నారు. గ్రేడ్ ఏ రకం క్వింటాల్‌కు రూ.775 మద్దతు ధర ఉండగా.. మిలర్లు రూ.876 వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 62,446 మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని చెప్పారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 2009 నాటికి మహిళలకు 25 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

Labels:

ఏపీ ఆన్‌లైన్‌లో ఉచితంగా తెలుగు సాఫ్ట్‌వేర్

 'ఏపీఆన్‌లైన్' www.aponline.gov.in లో తెలుగు సాఫ్ట్‌వేర్‌ను ఉంచామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ తెలిపారు. కంప్యూటర్ సాయంతో నిర్వహించే పాలన వ్యవహారాల్లోనూ తెలుగు వాడకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉంచినట్లు తెలిపారు. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని 'గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్' సూచికలో 'డౌన్‌లోడ్ తెలుగు సాఫ్ట్‌వేర్' ఉంటుందని తెలిపారు. విన్డోస్ ఎక్స్‌పీ ఉన్న కంప్యూటర్ల ద్వారానే డౌన్‌లోడ్ అవుతుంది.

Wednesday, December 26, 2007

సెల్‌లో విద్యుత్తు బిల్లు

సెల్‌ఫోన్ ఐదేళ్ల క్రితం వరకు సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకే ఉపయోగపడేది. ప్రస్తుతం ఈ ఫోన్ మరిన్నో సేవలను అందిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ పేపర్, మొబైల్ టీవీ... ఇలా వివిధ రకాలుగా రూపాంతరం చెందుతోంది. తాజాగా విద్యుత్తు శాఖ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్తుకు సంబంధించిన వివరాలను సెల్‌లో చూసుకునే వెసలుబాటు ఏర్పడింది. సీపీడీసీఎల్ అధికారులు జెనీవా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌తో కలిసి ఎస్.ఎం.ఎస్. ద్వారా విద్యుత్తు సంబంధిత సమాచారాన్ని వినియోగదారులకు అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సొంత భాషలో మెసేజ్‌లు పంపే సదుపాయం కల్పించింది. సీపీడీసీఎల్ ద్వారా సెల్‌ఫోన్ ఉన్న విద్యుత్తు వినియోగదారులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా బిల్లు వివరాలు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం వినియోగదారులు ముందుగా తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా విద్యుత్తు బిల్లు పంపడంతో పాటు, బిల్లు చెల్లించిన వెంటనే 'ధన్యవాదాలు' అంటూ సమాచారం పంపుతారు. వినియోగదారుడు ఉంటున్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో ఏమైనా అంతరాయాలుంటే ఆయా వివరాలూ పంపిస్తారు. ఇందుకు వినియోగదారుడికి అదనంగా ఎలాంటి ఛార్జీ పడదు. ఈ సేవలను మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితం చేశారు. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారు.
మొబైల్ వినియోగదారులు తమ విద్యుత్తు సర్వీసు నంబరు, ఈఆర్ కోడ్‌ను కంపోజ్ చేసి, 57333 నంబరుకు ఎస్ఎంఎస్ పంపి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెట్ అందుబాటులో ఉండే వినియోగదారులు www.apcentralpower.com  వెబ్‌సైట్‌లో 'మొబైల్ అలర్ట్స్' అనే లింక్‌లోకి వెళ్తే సరిపోతుంది. అక్కడ కోరిన సమాచారాన్ని అందజేసి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు

Labels:

Wednesday, December 5, 2007

శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యానికి నష్టపరిహారం

శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యం ప్రదర్శించినందున చోడవరం ప్రాంతానికి చెందిన వైద్యుడొకరు రూ.50 వేలు నష్ట పరిహారంతోపాటు వైద్య ఖర్చులకు పది వేలు, మరో పది వేలు ఖర్చులకు ఫిర్యాదికి చెల్లించాలని విశాఖపట్నం జిల్లా వినియోగదారుల ఫోరం- 1 అధ్యక్షుడు వై.ఢిల్లీశ్వరరావు తీర్పు చెప్పారు. బాధితుడు ముమ్మిడిశెట్టి కృష్ణ ఈనాడుకు అందించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రావి కమతంలో గతంలో ముమ్మడి శెట్టి కృష్ణ ఉండేవాడు. ఆ సమయంలో అతని జననేంద్రియాల వద్ద ఇబ్బందిగా ఉండటంతో చోడవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ కె.సుందర్‌రామాన్ని సంప్రదించాడు. బాధితుడిని పరీక్షించిన ఆయన చిన్న శస్త్రచికిత్స అవసరమని, దీనికి రూ.1000 చెల్లించాలని తెలిపారు. బాధితుడు ఫీజు చెల్లించిన పిదప డాక్టరు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇది పూర్తయిన తర్వాత అతనికి మరింత ఇబ్బంది కలగటంతో డాక్టరును తిరిగి సంప్రదించాడు. సుందరరామం పరీక్షించి వైద్య చికిత్స చేసినా ఫలితం లేకపోవటంతో బాధితుడు నగరానికి చెందిన డాక్టర్ బి.రాంబాబును సంప్రదించారు. మొదట జరిగిన శస్త్ర చికిత్సలో తలెత్తిన మైనరు లోపాన్ని రాంబాబు సరిదిద్దారు. శస్త్ర చికిత్సలో జరిగిన నిర్లక్ష్యానికి నష్టపరిహారం కోరుతూ బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరం-1లో కేసు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం-1 అధ్యక్షుడు వై.ఢిల్లేశ్వరరావు పై తీర్పు ఇచ్చారు

Labels: