Thursday, March 6, 2008

గంటపాటు విద్యుత్తు ఉపకరణాలకు స్వస్తి

విద్యుత్తు పొదుపుతో పాటు భూతాపానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా  ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందరూ ఇళ్లల్లో ఉన్న విద్యుత్తు దీపాలు ఆర్పి ఉద్యమానికి చేయూతనివ్వాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాఘవేందర్ కోరుతున్నారు. ముంబయిలో డిసెంబర్ 15న నిర్వహించిన 'బత్తీ బంద్' కార్యక్రమమే తమకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు.  ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి నగరంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న యువత రాఘవేందర్, మోహన్, మధుకర్, రజిత, పుష్కర్, సంపత్, షవాలీ నడుం బిగించారు. వీరంతా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు. ఏదైనా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఉద్యమం. ఈ కార్యక్రమానికి గ్రేటర్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ, నెడ్‌క్యాప్ తదితర సంస్థలూ సహకరిస్తున్నాయి. వివరాలకు 99088 15490లో సంప్రదించవచ్చన్నారు.

Labels:

Monday, January 14, 2008

పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే పారితోషికం

మనం పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే డబ్బులు చెల్లించడం ఎక్కడైనా ఉన్నదే. కానీ, వాడినందుకు మనకే డబ్బులిస్తోంది ఒక సంస్థ. ఒక్కసారికి పదిపైసల చొప్పున లెక్కకట్టి మరీ నెలవారీ చెల్లింపులు చేస్తోంది. తిరుచిరాపల్లి (కేరళ) సమీపంలోని ముసిరికి చెందిన సొసైటీ ఫర్‌ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ అలా చేస్తోంది! ఎరువుగా మలమూత్రాల వాడకంపై పరిశోధనలు జరిపే లక్ష్యంతో ఈ పని చేస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ సుబ్బరామన్‌ చెప్పారు.

Labels:

Tuesday, November 6, 2007

పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నతుమ్మ

ఢిల్లీలో పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్డు వెంట నాటిన 'తుమ్మ (ప్రొసోపిస్ జులిఫ్లోరా)' మొక్కలు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించిన ఈ మొక్కలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢి ల్లీలో 7,777మొక్క లు నాటారని, ఇవి పెరుగుతున్న ప్రాంతంలో ఇతర వృక్షజాతులు మనుగడ సాగించడం లేదని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డీగ్రేడెడ్ ఎకోసిస్టమ్స్(సీఈఎండీఈ)కి చెందిన ప్రొఫెసర్ సీఆర్ బాబు వెల్లడించారు. ' చెట్ల వేర్లు దాదాపు 21మీటర్ల లోతు మేరకు భూమిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వర్షపు నీరు లోపలికి వెళ్లడం సాధ్యం కాదు. ఈ మొక్క సమీపంలోని నేలలో భూసారం, తేమ తగ్గుతుంది'అని అంటారాయన. వీటి ఆకుల్లో ఒక రకమైన రసాయనం ఉండడం వల్ల అవి మండే స్వభావం కలిగి ఉండడంతో పాటు త్వరగా కుళ్లిపోయే అవకాశముండదని నిపుణులు చెబుతున్నారు. తుమ్మ వల్ల కలిగే హాని గురిం చి తెలుసుకోవడానికి గుజరాత్ పర్యావరణ శాఖ కచ్ ప్రాంతంలో నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈజాతికి చెందిన మొక్కలు ఎదుగుతున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం, ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. తుమ్మ మొక్కలు దట్టంగా ఉండి అధికభాగాన్ని ఆక్రమించడం వల్ల నేలపై వెలుతురు ప్రసరించే వీలుండడం లేదని కనుగొన్నారు. తుమ్మ మొక్కలు నాటిన తరువాత కచ్ ప్రాంతంలో ఒక పక్షి కూడా కనపడలేదంటే వీటి ప్రభావం ఎలా ఉంటుం దో సులభంగానే గ్రహించవచ్చు. వీటిని తినడం వల్ల అక్కడ భారీ సంఖ్యలో పశువులు మరణించాయి. ప్రభుత్వం ఏమంటోంది ? ఈ విషయమై పర్యావరణశాఖ సీనియర్ సైంటిఫిక్ అధికారి డాక్టర్ బీ.సీ. సబత్ స్పందిస్తూ ఈమొక్కలను ధ్వంసం చేసి వీటి స్థానంలో కొత్తవి నాటడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.

Labels: , ,

Thursday, October 25, 2007

చెత్త మీద రూ.22 కోట్లు మిగులు

ఢిల్లీ నగరంలో చెత్త ఏరుకునేవారు ఢిల్లీ ప్రభుత్వానికి ఏటా రూ.22 కోట్లను ఆదా చేస్తున్నారని అసోఛామ్ ఐఎల్ఎఫ్ అండ్ ఎస్ ఎకోస్మార్ట్ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వం సేకరించే దానికన్నా చెత్త ఏరుకునేవారే ఎక్కువగా చెత్త సేకరిస్తున్నారని, నగరంలోని సాలిడ్ వేస్ట్‌లో 17 శాతాన్ని చెత్త ఏరుకునేవారు సేకరించి, వేరు చేసి ఉచితంగా రవాణా చేస్తున్నారని అధ్యయనం తెలిపింది. ఈ అనియత చెత్త వ్యాపారం కారణంగా ప్రభుత్వానికి రోజుకు ఆరు లక్షల రూపాయలు ఆదా అవుతున్నాయని అధ్యయనం పేర్కొంది. మున్సిపల్ సాలిడ్‌వేస్ట్‌లో అధిక భాగాన్ని ఏ జాగ్రత్తలు పాటించకుండానే లోతట్టు ప్రాంతాలలో పారవేస్తున్నారని కూడా అధ్యయనంలో ఉంది. భారతదేశంలో ఉత్పత్తయే ప్లాస్టిక్ వృధాలో 40 నుంచి 80 శాతాన్ని రీసైకిల్ చేస్తున్నారని, అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రిసైక్లింగ్ రేటు 10 నుంచి 15 శాతం మాత్రమేనని అధ్యయనం తెలిపింది.

Labels: , ,