Monday, April 14, 2008

బ్యాగును పోగొట్టినందుకు రూ. 2 లక్షల పరిహారం

బ్యాగును రవాణా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూ. రెండు లక్షలు పరిహారంగా ప్రయాణికునికి చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. స్థానిక న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అంకాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న డాక్టర్ రాకేష్ చోప్రా 1998 నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఏథెన్స్ వెళ్లారు. అక్కడ విమానం దిగిన తరువాత తన పరిశోధనాపత్రాలున్న బ్యాగు కనిపించకుండా పోయిన విషయాన్ని డాక్టర్ రాకేష్ గుర్తించారు. ఇతర బ్యాగులు కూడా కదిలించినట్టు కనిపించాయి. పోయిన బ్యాగు ఆచూకీ కోసం సిబ్బంది చేసిన యత్నం ఫలించలేదు. దీంతో ఆయన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనలేకపోయారు. తరువాత ఢిల్లీ వినియోగదారుల కమిషన్‌ను డాక్టర్ రాకేష్ ఆశ్రయించారు.

Labels: ,

Tuesday, February 12, 2008

వంటనూనె తయారీ యూనిట్లపై దాడి

వంటనూనె తయారీ యూనిట్లపై తూనికలు, కొలతల అధికారులు దాడులు చేసి 58 మిల్లులపై కేసులు నమోదు చేశారు. తక్కువ మోతాదులో అయిల్‌ను ప్యాకింగ్‌ చేస్తున్న యూనిట్లపై హైదరాబాద్‌, రంగారెడ్డిలకు చెందిన అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని గగన్‌పహాడ్‌, కాటేదాన్‌, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉన్న గోవర్దన్‌, మనియర్‌, అనీల్‌, అరుణ, గుడ్‌ హెల్త్‌ ఆగ్రోటెక్‌, షాలిమర్‌ డ్రాప్‌, ధూల్‌చంద్‌, పవన్‌, షాలిమర్‌, సర్దా, శీతల్‌, రామచరణ్‌ రిఫైనరీ అయిల్‌ యూనిట్లపై కేసులు నమోదు చేశామని లీగల్‌మెట్రాలజీ కంట్రోలర్‌ తెలిపారు.

Labels:

Monday, January 14, 2008

వైద్యులు, ఆస్పత్రులు నిబంధనలను పాటించాలి

జాతీయ వైద్యమండలి నిబంధనలను రాష్ట్రంలోని వైద్యులు, ఆస్పత్రుల యాజమాన్యాలు విధిగా అనుసరించాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్యమండలి ఛైర్మన్‌ డాక్టర్‌ వల్లభనేని రాంప్రసాద్‌ కోరారు. ఇటీవల నిబంధనలను ఉల్లంఘించిన ఇరువురి వైద్యులపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాల వైద్యుడు వి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలు నిరూపణ అయ్యాయని తెలిపారు. తిరుపతికి చెందిన వైద్యుడు ఎం.శ్రీనివాసరావు కూడా నిబంధనలను ఉల్లంఘించినందున వీరిరువురి రిజిస్ట్రేషన్లు ఏడాది పాటు రద్దు చేస్తున్నామని చెప్పారు. ''వివిధ రకాల దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్స చేస్తామంటూ కొందరు వైద్యులు పత్రికలు, కరపత్రాల ద్వారా జారీచేస్తున్న ప్రకటనలు వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇకపై వైద్యులు, ఆస్పత్రులు ప్రకటనలు జారీ చేసేటప్పుడు నైతిక విధానాలను అనుసరించాలి'' అని కోరారు.

Labels:

Thursday, December 27, 2007

పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు

రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 24 గంటలూ పని చేసేలా మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో కిరోసిన్ బంకులను కూడా నెలకొల్పుతున్నట్లు చెప్పారు. దీన్ని నివారించడం కోసమే ముందుగా పాత తాలూకా కేంద్రాల్లో మందుల షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళలో పౌరసరఫరాల సంస్థ విజయవంతంగా మందుల షాపులను నడుపుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఖరీప్‌లో రైతులకు వరి ధాన్యం మద్దతు ధరలు లభిస్తున్నాయన్నారు. గ్రేడ్ ఏ రకం క్వింటాల్‌కు రూ.775 మద్దతు ధర ఉండగా.. మిలర్లు రూ.876 వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 62,446 మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని చెప్పారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 2009 నాటికి మహిళలకు 25 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

Labels:

Wednesday, December 26, 2007

సెల్‌లో విద్యుత్తు బిల్లు

సెల్‌ఫోన్ ఐదేళ్ల క్రితం వరకు సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకే ఉపయోగపడేది. ప్రస్తుతం ఈ ఫోన్ మరిన్నో సేవలను అందిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ పేపర్, మొబైల్ టీవీ... ఇలా వివిధ రకాలుగా రూపాంతరం చెందుతోంది. తాజాగా విద్యుత్తు శాఖ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్తుకు సంబంధించిన వివరాలను సెల్‌లో చూసుకునే వెసలుబాటు ఏర్పడింది. సీపీడీసీఎల్ అధికారులు జెనీవా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌తో కలిసి ఎస్.ఎం.ఎస్. ద్వారా విద్యుత్తు సంబంధిత సమాచారాన్ని వినియోగదారులకు అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సొంత భాషలో మెసేజ్‌లు పంపే సదుపాయం కల్పించింది. సీపీడీసీఎల్ ద్వారా సెల్‌ఫోన్ ఉన్న విద్యుత్తు వినియోగదారులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా బిల్లు వివరాలు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం వినియోగదారులు ముందుగా తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా విద్యుత్తు బిల్లు పంపడంతో పాటు, బిల్లు చెల్లించిన వెంటనే 'ధన్యవాదాలు' అంటూ సమాచారం పంపుతారు. వినియోగదారుడు ఉంటున్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో ఏమైనా అంతరాయాలుంటే ఆయా వివరాలూ పంపిస్తారు. ఇందుకు వినియోగదారుడికి అదనంగా ఎలాంటి ఛార్జీ పడదు. ఈ సేవలను మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితం చేశారు. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారు.
మొబైల్ వినియోగదారులు తమ విద్యుత్తు సర్వీసు నంబరు, ఈఆర్ కోడ్‌ను కంపోజ్ చేసి, 57333 నంబరుకు ఎస్ఎంఎస్ పంపి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెట్ అందుబాటులో ఉండే వినియోగదారులు www.apcentralpower.com  వెబ్‌సైట్‌లో 'మొబైల్ అలర్ట్స్' అనే లింక్‌లోకి వెళ్తే సరిపోతుంది. అక్కడ కోరిన సమాచారాన్ని అందజేసి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు

Labels:

Wednesday, December 5, 2007

శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యానికి నష్టపరిహారం

శస్త్ర చికిత్సలో నిర్లక్ష్యం ప్రదర్శించినందున చోడవరం ప్రాంతానికి చెందిన వైద్యుడొకరు రూ.50 వేలు నష్ట పరిహారంతోపాటు వైద్య ఖర్చులకు పది వేలు, మరో పది వేలు ఖర్చులకు ఫిర్యాదికి చెల్లించాలని విశాఖపట్నం జిల్లా వినియోగదారుల ఫోరం- 1 అధ్యక్షుడు వై.ఢిల్లీశ్వరరావు తీర్పు చెప్పారు. బాధితుడు ముమ్మిడిశెట్టి కృష్ణ ఈనాడుకు అందించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రావి కమతంలో గతంలో ముమ్మడి శెట్టి కృష్ణ ఉండేవాడు. ఆ సమయంలో అతని జననేంద్రియాల వద్ద ఇబ్బందిగా ఉండటంతో చోడవరం ప్రాంతానికి చెందిన డాక్టర్ కె.సుందర్‌రామాన్ని సంప్రదించాడు. బాధితుడిని పరీక్షించిన ఆయన చిన్న శస్త్రచికిత్స అవసరమని, దీనికి రూ.1000 చెల్లించాలని తెలిపారు. బాధితుడు ఫీజు చెల్లించిన పిదప డాక్టరు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇది పూర్తయిన తర్వాత అతనికి మరింత ఇబ్బంది కలగటంతో డాక్టరును తిరిగి సంప్రదించాడు. సుందరరామం పరీక్షించి వైద్య చికిత్స చేసినా ఫలితం లేకపోవటంతో బాధితుడు నగరానికి చెందిన డాక్టర్ బి.రాంబాబును సంప్రదించారు. మొదట జరిగిన శస్త్ర చికిత్సలో తలెత్తిన మైనరు లోపాన్ని రాంబాబు సరిదిద్దారు. శస్త్ర చికిత్సలో జరిగిన నిర్లక్ష్యానికి నష్టపరిహారం కోరుతూ బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరం-1లో కేసు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరం-1 అధ్యక్షుడు వై.ఢిల్లేశ్వరరావు పై తీర్పు ఇచ్చారు

Labels:

Friday, November 30, 2007

పంచాయతీల్లో సిటిజన్స్ ఛార్టర్

ప్రజల అవసరాల మేరకు నాణ్యమైన సేవలను, నిర్ణీత కాల వ్యవధిలో సేవా సంస్థలు అందించేలా చేసే లక్ష్యంతో ప్రారంభమైనవే 'సిటిజన్ ఛార్టర్లు' (పౌరుల అధికార పత్రాలు). 'ప్రజల కొరకే ప్రభుత్వం' పనిచేసేలా చూస్తూ పౌరులకు మరింత బలాన్ని చేకూర్చటమే ఈ సిటిజన్ ఛార్టర్ల ప్రధాన లక్ష్యం. అత్యధిక ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ, దురదృష్టవశాత్తు ప్రజలకు సన్నిహితంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేలా చూసేందుకు అటు ప్రభుత్వం వైపు నుంచి గానీ, ఇటు ప్రజా సంఘాల నుంచి గానీ స్పష్టమైన ప్రయత్నాలు చాలా కాలం పాటు జరగలేదు. దాంతో ప్రభుత్వ విభాగాల కార్యకలాపాలలో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీగా ఉండటం మరుగున పడిపోయాయి. వీటన్నిటికీ తోడు ప్రభుత్వ విధాన నిర్ణయాలలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ప్రజలకు లేకుండా పోతోంది. ఈ కారణాలన్నిటి వల్లా మరింత ఉత్తమమైన, నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే ప్రభుత్వం కావాలని డిమాండ్ చేసే శక్తీ సమాచారమూ చొరవా ప్రజల్లో ఉండటం లేదు.
ఇప్పటి వరకు 'ఇచ్చే వారే ప్రజల నెత్తిన రుద్దేవారుగా' కొనసాగుతున్నారు. అయితే ఇపుడు పొందటమనేది వినియోగదారుల హక్కుగా మారిందని పౌరుల అధికార పత్రం నొక్కి చెబుతుంది. ఇది వివిధ రకాల వస్తు సేవలను అందించే ప్రైవేట్ సంస్థలకే కాక ప్రభుత్వానికీ వర్తిస్తుంది. ప్రభుత్వానికి కస్టమర్లు ప్రజలే. ప్రభుత్వం ప్రజల కొరకే ఉందనీ, ప్రభుత్వానికి ప్రజలు వాడకందార్లనీ, వారికి నాణ్యమైన, సమర్థవంతమైన సేవలను అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందనీ గుర్తుంచుకోవాలి.
ప్రతి పౌరుడూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి పన్నులను చెల్లిస్తున్నాడు. ప్రజలు పొందే ఏ సేవా ఉచితంగా రావటం లేదు. కనుక వారి అవసరాల మేరకు ప్రశస్తమైన, నాణ్యమైన సేవలను సరసమైన ధరలో పొందే హక్కు వారికి ఉంది. ఈ హక్కును సాధించుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం పని తీరులో సమూలాగ్రమైన మార్పు రావాలి. ప్రజలూ ప్రజా సంఘాలూ ప్రభుత్వ విధాన నిర్ణయాల రూపకల్పనలో, వాటి అమలులో చురుకుగా పాల్గొనాలి. ఈ అంశాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంస్థకూ సంబంధించి కనీస ప్రమాణాలను నిర్థారించి, ఎప్పటికప్పుడు ఆయా సంస్థల పని తీరును సమీక్షించి తగు మార్పులు, చేర్పులు చేపట్టే లక్ష్యంతో సిటిజన్ ఛార్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది.
దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలకు కూడా అవి అందించే సేవలు, ఆ సేవలను పొందే విధానం, సేవలను అందించేందుకు పట్టే కాల వ్యవధి తదితర వివరాలతో సిటిజన్ ఛార్టర్లను ప్రకటించటం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో 2.10.2002వ తేదీన జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా, గ్రామ సభ నిర్వహణతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలోను ఒక పౌర సేవా కేంద్రాన్ని ప్రారంభించవలసిందిగా కోరటమైంది. పౌరసేవా కేంద్రం బాధ్యతలను గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఒకరికి అప్పగించవలసిందిగా సూచించటం జరిగింది.
గ్రామ పంచాయతీ అందించే సేవలు, వాటిని పొందేందుకు పట్టే కాల పరిమితి వివరాలతో కూడిన నమూనా సిటిజన్ ఛార్టర్ను ఇక్కడ ఇవ్వటం జరిగింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా, కొద్ది పాటి మార్పులతో ఈ నమూనాను గ్రామ సభ ముందు ప్రవేశపెట్టి, సభ ఆమోదాన్ని పంచాయతీ పొందాలి.
గ్రామ పంచాయతీ సేవలను కోరే పౌరులు అవసరమైన ఆధారాలను జత చేస్తూ దరఖాస్తును గ్రామ పంచాయతీలోని పౌర సేవా కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు అందజేయాలి. స్థానిక పరిస్థితులను బట్టి, ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఈ సమయాన్ని గ్రామ పంచాయతీ మార్చుకోవచ్చు. పౌర సేవా కేంద్రం నిర్వహణకు బాధ్యత వహిస్తున్న వ్యక్తి దరఖాస్తు అందినట్లు తెలుపుతూ తేదీ, సమయం పేర్కొంటూ రశీదును జారీ చేయాలి. నిర్దేశించిన సమయం తర్వాత పౌరులు తాము ఆశిస్తున్న అనుమతి/ధృవీకరణ పత్రం/సేవను పౌర సేవా కేంద్రం నుంచి పొందవచ్చు. సాధారణంగా ప్రతి రోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు అనుమతులు/ధృవీకరణ పత్రాలు/లైసెన్సులను జారీ చేయటం జరుగుతుంది.
దరఖాస్తులను స్వీకరించే సమయం లోనే పౌరుడు పూర్తి వివరాలను పొందుపరిచేట్లు గ్రామ పంచాయతీ సహాయం అందించాలి. నిర్దేశించిన కాల పరిమితి లోపు దరఖాస్తుదారునికి సేవ/ధృవీకరణ పత్రం/లైసెన్సును గ్రామ పంచాయతీ ఇవ్వలేకపోతే, ఆలస్యమైన రోజుకు పది రూపాయల చొప్పున టోకెన్ నష్ట పరిహారాన్ని దరఖాస్తుదారునికి గ్రామ పంచాయతీ నిధి నుంచి చెల్లించాలి. ఆ పరిహారాన్ని తర్వాత సంబంధిత ఆలస్యానికి కారణమైన ఉద్యోగి జీతం నుంచి మినహాయించాలి.

గ్రామ పంచాయతీల్లో పనుల కాల వ్యవధి
ధృవీకరణ పత్రాల జారీ కాల పరిమితి
స్వగ్రామ (నేటివిటీ) ధృవీకరణ పత్రం జారీ 2 రోజులు
నివాస ధృవీకరణ పత్రం జారీ 2 రోజులు
కుల ధృవీకరణ పత్రం జారీకి సిఫారసు 2 రోజులు
ఆదాయ ధృవీకరణ పత్రం జారీకి సిఫారసు 2 రోజులు
జనన మరణ ధృవీకరణ పత్రం జారీ 5 రోజులు

రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు కాల పరిమితి
జనన మరణాల రిజిస్ట్రేషన్ 3 రోజులు
ఆస్తి పన్ను గణన, ఇంటి నెంబరు కేటాయింపు 15 రోజులు
భవన నిర్మాణ దరఖాస్తుల పరిష్కారం 15 రోజులు
నీటి సరఫరా మంజూరు 30 రోజులు
ఆస్తి బదిలీ (మ్యుటేషన్) 15 రోజులు
లైసెన్సుల జారీ 5 రోజులు
పహణి/అడంగల్ ఎక్స్ట్రాక్ట్ 2 రోజులు

సమస్యల తొలగింపు కాల పరిమితి
పైపులైన్ లీకేజీల మరమ్మత్తు 24 గంటలు
చేతి పంపుల మరమ్మత్తులు 3 రోజులు
వీధి దీపాల్లో బల్బులు, ట్యూబుల రీప్లేస్మెంట్ 2 రోజులు
నిలిచిపోయిన మురుగు కాల్వలు 2 రోజులు
రోడ్డు కోతలు, గుంతలు 3 రోజులు
చెత్త కుండీల శుభ్రతపై ఫిర్యాదులు 2 రోజులు
పంచాయతీ/ప్రభుత్వానికి ఎవరైనా వ్యక్తి
చెల్లించాల్సిన బకాయిల వివరాలు 5 రోజులు

పంచాయతీల్లో సిటిజన్ ఛార్టర్ల అమలు నిరాశాజనకం
కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యయనం వెల్లడి
పంచాయతీల్లో సిటిజన్ ఛార్టర్ల అమలు తీరుపై కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ 2004-05 సంవత్సరంలో ఒక అధ్యయనం చేసింది. విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల లోని కొన్ని ఎంపిక చేసిన మండలాల లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సిటిజన్ ఛార్టర్ల విషయమై ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకొనే లక్ష్యంతో ఒక సర్వే చేసింది.
నిర్దేశించిన కాల పరిమితి లోపు దరఖాస్తుదారునికి సేవ/ధృవీకరణ పత్రం/లైసెన్సును గ్రామ పంచాయతీ ఇవ్వలేకపోతే, ఆలస్యమైన రోజుకు పది రూపాయల చొప్పున టోకెన్ నష్ట పరిహారాన్ని దరఖాస్తుదారునికి గ్రామ పంచాయతీ నిధి నుంచి చెల్లించాలనే విషయం సిటిజన్ ఛార్టర్లలో ఉన్నట్లు ఏ ఒక్క పంచాయతీ కార్యదర్శికీ తెలియదని ఈ సర్వేలో వెల్లడైంది. ఆ పరిహారాన్ని తర్వాత సంబంధిత ఆలస్యానికి కారణమైన ఉద్యోగి జీతం నుంచి మినహాయించాలనే విషయం ఎవరికీ తెలియదు. సిటిజన్ ఛార్టర్ నమూనాను గ్రామ సభలో ప్రవేశపెట్టి, సిటిజన్ ఛార్టర్ గురించి ప్రజలందరికీ తెలియజేసి, గ్రామ సభ నిర్ణయం మేరకు దానిలో మార్పులు చేయటం అనేది ఏ గ్రామ పంచాయతీ లోను జరగలేదని ఈ సర్వేలో వెల్లడైంది.


ఆంధ్ర ప్రదేశ్లో సిటిజన్ ఛార్టర్లను ప్రకటించిన కొన్ని సంస్థలు :

  • ఎ.పి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
  • ఎ.పి. ఫైర్ సర్వీసెస్
  • ఎ.పి. ఇండస్ట్రియల్ డవలప్మెంట్ కార్పొరేషన్
  • ఎ.పి. ట్రాన్స్కో/ డిస్కమ్
  • ఎ.పి. హౌసింగ్ బోర్డు
  • ఎ.పి. హౌసింగ్ కార్పొరేషన్
  • ఎ.పి. హౌసింగ్ ఫెడరేషన్
  • ఎ.పి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
  • ఎ.పి. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
  • ఎ.పి. పోలీస్
  • ఎ.పి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ
  • ఎ.పి. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
  • బి.సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్
  • బోర్డ్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్
  • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
  • బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
  • బాయిలర్స్ డిపార్ట్మెంట్
  • ఛీఫ్ ఇంజనీర్స్, నేషనల్ హైవేస్
  • సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్
  • కమీషనరేట్ ఆఫ్ టెండర్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హజ్బెండరీ
  • డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ హాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ
  • డిపార్ట్మెంట్ ఆఫ్ స్మాల్ సేవింగ్స్, లాటరీస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్
  • డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
  • ఇఎస్ఐ హాస్పటల్స్
  • గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్
  • జవహర్ బాల భవన్
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
  • మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్
  • పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్
  • ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ డిపార్ట్మెంట్
  • స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
  • స్టేట్ ఆర్చివ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  • తెలుగు అకాడమీ
  • డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (హోమియోపతి, ఆయుర్వేదిక్ హాస్పటల్స్)
  • దాదాపు జాతీయ బ్యాంకులన్నీ కూడా సిటిజన్ ఛార్టర్స్ను ప్రకటించాయి.

Labels:

Sunday, November 25, 2007

వినియోగదారుల సంఘాలకు శిక్షణ

ఆంధ్ర ప్రదేశ్ వినియోగదారుల సంఘాల సమాఖ్య ఇటీవల వినియోగదారుల సంఘాల నిర్వాహకుల కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి కాసు వెంకట క్ర్రిష్ణారెడ్ది, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గాలి ఉదయ కుమార్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంచాలకుడు శర్మ, కాప్కో గౌరీశంకర్, నాగేశ్వ్రర రావ్ తదితరులు పాల్గొన్నారు.

Labels: ,

Tuesday, October 23, 2007

పొయ్యి కొంటేనే రీ కనెక్షన్

'ఒకటి కొంటే మరోటి ఉచితం' అనే చౌకబేరం కాదిది. 'ఒకటి కొనకపోతే... అర్హమైన మరోదాన్నీ పొందలేరు' అన్న ఖరీదైన కొత్త పథకం ఇది. దీన్ని నడిపిస్తున్నది చమురు కంపెనీలు. అమలుచేస్తున్నది రాష్ట్రంలోని గ్యాస్‌డీలర్లు. ఇప్పటికే వివిధ గ్యాస్ సమస్యల్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారుడు తాజాగా చమురు కంపెనీల 'గ్రీన్ స్టౌ' మంటపై కుతకుతా ఉడికిపోతున్నాడు. 'మేం సరఫరాచేసే గ్రీన్ లేబుల్ స్టౌను కొంటేనే మీకు కనెక్షన్లు ఇచ్చేది' అంటూ గ్యాస్‌డీలర్ల ప్రతినిధులు ఇళ్లకొచ్చీ మరీ చేస్తున్న ఒత్తిళ్లు వినియోగదారులకు దిమ్మదిరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతానికి రీ కనెక్షన్ కోసం వచ్చేవారిపై ఇలాంటి ఒత్తిళ్లు చేస్తున్నారు. బలవంతంగా స్టౌలు కొనిపిస్తున్నారు. మున్ముందు గ్యాస్ కనెక్షన్ కలిగిన రాష్ట్రంలోని కోటి మూడు లక్షల కుటుంబాలకూ ఈ స్టౌలను అంటగట్టేందుకు చమురు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా భారీ ఆదాయంపై కన్నేశాయి.
కొత్త స్టౌ కొనసాల్సిందేనన్న ఒత్తిళ్లు గతంలో గ్యాస్ డీలర్ల కార్యాలయాలకు వచ్చే వినియోగదారులపై ఉండేవి. ఒకవేళ కొత్త స్టౌ కొనకపోయినా కొన్నిసార్లు చూసీ చూడనట్లు వదిలేసి రీ కనెక్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు డీలర్ల ప్రతినిధులే వినియోగదారుడి ఇంటికి వెళుతున్నారు. కొత్త స్టౌ కొనకపోతే మాత్రం రీ కనెక్షన్ ఇవ్వడం లేదు.

రీఫిల్ చేసిన గ్యాస్ సిలిండర్లను ఇంకొన్ని ఎక్కువ రోజులు వినియోగించుకునేందుకు వీలుగా గ్రీన్‌లేబుల్ స్టౌల తయారీని చమురు కంపెనీలు మొదలు పెట్టించాయి. వీటి వల్ల కాలుష్యం ఏర్పడదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. వీటిని గ్యాస్ డీలర్ల ద్వారా వినియోగదారులకు విక్రయించాలని తలపెట్టాయి. ఇందులో తొలివిడతగా... రీ కనెక్షన్ కోరుకునే వారికి విక్రయించాలని నిర్ణయించాయి. ఓ పట్టణం నుంచి మరో పట్టణానికి బదిలీపైనో, ఇతరత్రా కారణంతోనో వినియోగదారులు మారితే... రీ-కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. వీరికి కనెక్షన్ ఇవ్వాలంటే కొత్త గ్రీన్ లేబుల్ స్టౌ కొనాల్సిందేనని డీలర్లు షరతు పెడుతున్నారు. సంబంధిత వినియోగదారుని ఇంటికి గ్యాస్ డీలర్ల ప్రతినిధులు వెళ్లి వారు ఉపయోగిస్తున్న స్టౌను పరిశీలిస్తున్నారు. ఈ పాత స్టౌ స్థానే తమ దగ్గరున్న గ్రీన్‌లేబుల్ స్టౌను కొనాల్సిందేనని పట్టుబుడుతున్నారు. అలా కొన్నాకే రీ-కనెక్షన్ ఇస్తున్నారు. అప్పటి దాకా వినియోగదారుడు ఉపయోగిస్తున్న స్టౌకు రూ.100 నుంచి రూ.200 వరకు లెక్కగడుతున్నారు. వారు ఇచ్చే గ్రీన్ స్టౌకు మాత్రం రేటును రూ.700 నుంచి రూ.2 వేల వరకు వసూలుచేస్తున్నారు. దీంతో పాటు సురక్ష ట్యూబ్ పేరుతో రూ.180 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా జరిగాకే రీ-కనెక్షన్ ఇస్తున్నారు.

Labels: